నలందా విశ్వవిద్యాలయము అనగా భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో నలందకు దగ్గరలో రాజగిరిలో ఉన్న ఒక కేంద్ర విశ్వవిద్యాలయం. ఇది ఆంగ్లంలో నలంద యూనివర్సిటీ గా లేదా యూనివర్సిటీ ఆఫ్ నలంద గా పిలవబడుతుంది. విద్యపరంగా మొదటి సెషన్ 2014 సెప్టెంబరు 1 న ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించేందుకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల నుండి 1,000 కి పైగా దరఖాస్తులు అందాయి. రెండు పాఠశాలల్లో ప్రారంభంగా ఒక్కొక్క దానికి 20 మంది లెక్కన 40 మంది విద్యార్థులను చేర్చుకోవాలని నిర్ణయించారు. కానీ తర్వాత పరిశీలన, ఇంటర్వ్యూలలో 15 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఈ విశ్వవిద్యాలయం పాత నలంద విశ్వవిద్యాలయాన్ని పునఃస్థాపించే ఉద్దేశముతో పునఃప్రారంభించబడింది. పాత నలందా విశ్వవిద్యాలయం అతి పురాతన అభ్యాస సంస్థలలో ఒకటి. ప్రప్రథమంగా ఈ విశ్వవిద్యాలయం గుప్త రాజుల చేత సా.శ. 5 వ శతాబ్దంలో స్థాపించబడింది.